న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఈ మధ్యాహ్నం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపియాన్ జిల్లాలోని నక్బాల్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. నక్బాల్ ఏరియాలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నారని బుధవారం మధ్యాహ్నం జమ్ముకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది.
దాంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ బృందం సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాగివున్న ఇంటిని కనిపెట్టి చుట్టుముట్టారు. ఇది గమనించిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దాంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. మృతుల్లో డానిష్ భట్ అనే సీరియల్ కిల్లర్ కూడా ఉన్నాడు.
ఈ ఎన్కౌంటర్ వివరాలను జమ్ము అండ్ కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఎన్కౌంటర్లో భద్రతాబలగాల వైపు ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు.