Mumbai | పాక్తో సంబంధంతో సంబంధమున్న ముగ్గురు ఉగ్రవాదులు ముంబయిలోకి ప్రవేశించారని, నగరంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. దాంతో ఒక్కసారిగా పోలీస్శాఖలో కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం పాక్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు దుబాయి మీదుగా ముంబయికి వచ్చినట్లుగా ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్లో సమాచారం అందించాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఇటీవల ముంబయిలో ఉగ్రవాదులు ప్రవేశించారని, బాంబు పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా మరోసారి నగరంలో ఉగ్రవాదులు ప్రవేశించారని కంట్రోల్ రూమ్కు సమాచారం అందించడంతో.. ఫేక్ కాలా? వాస్తవమేనా? తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను అధికారులు రంగంలోకి దింపారు. ఫోన్ చేసిన వ్యక్తి పాక్ నుంచి దుబాయి మీదుగా ముంబయికి వచ్చని ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు ముజిమ్ సయ్యద్ అని, ఫోన్, కార్ నంబర్ సైతం పోలీసులకు తెలిపాడు. అయితే, పోలీసులు మాత్రం ఫేక్ కాల్గా భావిస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ముంబయి ట్రాఫిక్ పోలీసులు విభాగం జాయింట్ కమిషనర్కు సైతం రాత్రి ఒంటిగంట సమయంలో ఇదే తరహాలో ఫోన్ వచ్చింది.
ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి మీరారోడ్లో బాంబు పేలుడు జరుగుతుందంటూ సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులు ఆ కాల్ నకిలీదని గుర్తించారు. ఇదిలా ఉండగా.. 2008 నవంబర్ 26న పాక్ నుంచి సముద్రమార్గం నుంచి ముంబయిలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఘాతుకం సృష్టించారు. విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో 166 మంది మృతి చెందగా.. 300 మంది గాయపడ్డాడు. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో భారత భద్రతా బలగాలు కీలక పాత్ర పోషించాయి. తొమ్మిది మంది ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. ఉగ్రవాది అజ్మల్ కసబ్ ప్రాణాలతో చిక్కగా.. 2012న ఉరితీసిన విషయం తెలిసిందే.