న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో ఇద్దరికి, మహారాష్ట్రలో ఒకరికి కొత్త వేరియంట్ కరోనా సోకింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 26కు పెరిగింది. ఈ నెల 4న జింబాబ్వే నుంచి గుజరాత్లోని జామ్నగర్కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడితో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. జింబాబ్వే నుంచి ఆ ఎన్ఆర్ఐ వ్యక్తితోపాటు వచ్చిన ఆయన భార్యకు, జామ్నగర్లోని బావకు ఒమిక్రాన్ పాజిటివ్గా శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో గుజరాత్లో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య మూడుకు చేరింది.
మరోహైపు ముంబైలోని ధారవి ప్రాంతంలో ఒక ఒమిక్రాన్ కేసును గుర్తించారు. టాంజానియా నుండి తిరిగి వచ్చిన వ్యక్తి కొత్త వేరియంట్ బారినపడినట్లు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను సెవెన్హిల్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 11కు పెరిగింది.
కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసుల మొత్తం సంఖ్య 25కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 11, రాజస్థాన్లో 9, గుజరాత్లో ౩, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా భారత్తో సహా 57 దేశాలు ఈ కొత్త కరోనా వేరియంట్ బారినపడ్డాయి.