ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొన్నాళ్లుగా వర్గపోరుతో దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు, పోలీసులు.. హింసను ప్రేరేపిస్తున్న మిలిటెంట్లే లక్ష్యంగా ఎన్కౌంటర్లతో హడలగొట్టారు. ఈ ఎన్కౌంటర్లలో దాదాపు 40 మంది మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో ఆర్మీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు దుండగులు పట్టుబట్టారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. దుండగులతోపాటు భారీగా మారణాయుధాలు పట్టబడ్డాయని పేర్కొంది. నిందితుల నుంచి మ్యాగీజన్తో కూడిన ఒక ఇన్సాస్ రైఫిల్, మొత్తం 60 రౌండ్ల 5.56 ఎంఎం మందుగుండు సామాగ్రి, చైనాకు చెందిన హ్యాండ్ గ్రనేడ్, డిటోనేటర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.