పుణె: మహారాష్ట్రలోని పుణె-సతారా రహదారిపై భుమ్కార్ చౌక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పాదచారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో పాదచారుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
భుమ్కార్ చౌక్ సమీపంలో ప్రమాదకరమైన మూలమలుపు ఉన్నదని, ఆ మూల మలుపు దగ్గరే ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో పాదచారులపైకి దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. గతంలో కూడా ఆ మలుపు దగ్గర చాలా ప్రమాదాలు జరిగాయన్నారు. పాదచారులను ఢీకొట్టగానే ట్రక్కు డ్రైవర్ రివర్స్ గేర్ వేయడంతో వెనుక ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దాంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.