కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం
పొంగిపొర్లిన వాగులూ వంకలు
మత్తళ్లు దుంకిన చెరువులు
కరీంనగర్ జిల్లాలో 41.7 మిల్లీమీటర్ల వర్షపాతం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 సెంటీమీటర్లు నమోదు
హుజూరాబాద్, ఇల్లంతకుంట మండలాల్లో అత్యధికం
కరీంనగర్/రాజన్న సిరిసిల్ల, జూలై 11 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో జోరు వాన పడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో సగటు వర్షపాతం 41.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలో అత్యధికంగా హుజూరాబాద్లో 90.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తిమ్మాపూర్లో 84.4, చిగురుమామిడిలో 84.4, సైదాపూర్లో 66.8, శంకరపట్నంలో 60.4, వీణవంకలో 38.6, జమ్మికుంటలో 29.4, రామడుగులో 16.4, చొప్పదండిలో 13.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ల వారీగా పరిశీలిస్తే శంకరపట్నంలో అత్యధికంగా 88.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జూలై 2న జిల్లాలో సగటున 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేని వానతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు మత్తళ్లు దుంకాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాన దంచికొట్టింది.
పలు గ్రామాల్లో చెక్డ్యాంలు, వాగులు పొంగి పొర్లాయి. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లే రహదారిలో సండ్ర వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచి పోయాయి. కార్మిక క్షేత్రం జలమయమైంది. సంజీవయ్యనగర్, వెంకంపేట, ప్రగతినగర్, అశోక్నగర్, పాతబస్టాండ్, కరీంనగర్, సుభాష్నగర్ రోడ్లు నీరు నిలిచి చెరువులను తలపించాయి. వానకాలం ప్రారంభం నుంచి ఇప్పటిదాక ఇదే భారీ వర్షం. జిల్లా వ్యాప్తంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా ఇల్లంతకుంట మండలంలో 118.3 మిల్లీమీటర్లు, అత్యల్పంగా వేములవాడ మండలం మల్లారంలో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నేరెళ్లలో 111.3, పెద్దూరులో 97.3, ఆవునూరులో 80.3, ఎల్లారెడ్డిపేటలో 58, గజసింగవరంలో 49.5, పెద్దలింగాపూర్లో 45.5, నామాపూర్లో 38.3, సిరిసిల్లలో 33.3, మర్థనపేటలో 32.3, గంభీరావుపేటలో 21.3, వీర్నపల్లిలో 17.8, మానాలలో 7.0, రుద్రంగిలో 5.3, బోయినపల్లిలో 1.8, నిమ్మపల్లిలో 1.5, వట్టెంలలో 1.0, మల్లారంలో 0.5 శాతం వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురువడంతో నాటు వేసిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.