న్యూఢిల్లీ, నవంబర్ 9: ఢిల్లీ, రాజస్థాన్, గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్లు సతీశ్ చంద్ర శర్మ, అగస్టీన్ జార్జ్ మసిహ్, సందీప్ మెహతాలతో సీజేఐ చంద్రచూడ్ గురువారం సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఇతర జడ్జీలు, న్యాయవాదులు, కొత్తగా నియమితులైన జడ్జీల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారంతో అత్యున్నత న్యాయస్థానం తన పూర్తి సామర్థ్యమైన 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. కొత్త జడ్జీల నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్లో ప్రకటించారు.
జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు జడ్జీగా నియమితులయ్యారు. 2021 అక్టోబర్ 11న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పదోన్నతి పొందారు. 2022 జూన్ 28న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా బదిలీ అయ్యారు. జస్టిస్ ఏజీ మసిహ్ 2008లో పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జీగా నియమితులయ్యారు. 2023 మే 30న రాజస్థాన్ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. జస్టిస్ సందీప్ మెహతా 2011లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 ఫిబ్రవరి 15న గువాహటి హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, నవంబర్ 9: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తీవ్ర జాప్యం చేస్తున్నారని పేర్కొంటూ కేరళ ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బిల్లులపై సంతకం పెట్టడానికి నిర్దిష్ట గడువు విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేరళ హైకోర్టు తిరస్కరించిందని, దీనిపై స్పష్టతనివ్వాలని తాజాగా కోరింది.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై రాజ్యాంగం ప్రకారం గవర్నర్ సంతకం చేయాలని, కానీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బిల్లులను తొక్కిపెడుతున్నారని తెలిపింది. కాగా, గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును కేరళ ప్రభుత్వం ఆశ్రయించడం ఈ నెలలో ఇది రెండోసారి.