అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విషాద సంఘటన జరిగింది. కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించేందుకు ముగ్గురు స్నేహితులు అక్కడకు వెళ్లారు. పవిత్ర స్నానం కోసం సరయూ నదిలో దిగిన యువకులు అందులో మునిగి మరణించారు. (Three Friends Drown In Saryu River) ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన 20 ఏళ్ల రవి మిశ్రా, 18 ఏళ్ల హర్షిత్ అవస్థి, 16 ఏళ్ల ప్రియాంషు సింగ్, రామ మందిరం సందర్శన కోసం ఆదివారం అయోధ్య చేరుకున్నారు. రాముడ్ని దర్శించే ముందు పవిత్ర స్నానం ఆచరించేందుకు అక్కడి సరయూ నదిలోకి దిగారు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు ఆ నదిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు ఆ యువకులను నది నుంచి బయటకు తెచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వారు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఆ ముగ్గురు యువకులు సాధారణ స్నాన ఘాట్కు వెళ్లకుండా రామ్ కథా పార్కు సమీపంలోని శ్మశాన వాటిక పక్కనే ఉన్న నది ఒడ్డుకు వెళ్లారని, అక్కడ మునిగి చనిపోయారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.