జైపూర్: ఒక ప్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో, ముగ్గురు పిల్లలతో సహా నలుగురు మరణించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ ఘటన జరిగింది. జామ్వా రామ్గఢ్లోని టర్పెంటైన్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి, ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు పోలీస్ అధికారి శివ కుమార్ తెలిపారు. మరణించిన పిల్లల వయసు 2-5 ఏండ్ల మధ్య ఉంటుందని చెప్పారు. నలుగురు కూడా మంటల్లో సజీవ దహనమయ్యారని వివరించారు. మంటలను అదుపుచేసిన తర్వాత కాలిపోలిన మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. మంటలను అదుపు చేయడానికి నాలుగైదు గంటలు శ్రమించాల్సి వచ్చిందన్నారు.
కాగా, ధులారాజీ గ్రామంలోని ఈ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నారని స్థానికులు తెలిపారు. కార్మికులతోపాటు వారి పిల్లలు కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. మంటలు చెలరేగడంతో కార్మికులంతా పరుగులు తీశారని, దీంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొన్నదని అన్నారు.
మరోవైపు మృతులను గరిమ (3) అంకుష్ (5), దివ్య (2)గా గుర్తించారు. సంఘటనా స్థలంలో ఉన్న ఫ్యాక్టరీ యజమాని శంకర్లాల్ మేనల్లుడు రమేష్ ఆర్య అలియాస్ కాలు (25) పిల్లలను రక్షించేందుకు లోపలికి వెళ్లి మంటల్లో చిక్కుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కాలిన గాయాలైన కొందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.