UP Polls : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజన్ నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యానాధ్ల జోడు గుర్రాల స్వారీతో విజయతీరాలకు చేరాలనే కాషాయ పార్టీ ఆకాంక్షలకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. నోట్ల రద్దు అనంతరం కొద్దినెలలకే జరిగిన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ఇమేజ్తో పాటు హిందుత్వ నినాదంతో ఘన విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటోంది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విజయ్ యాత్ర ర్యాలీలకు జనం పోటెత్తుతుండటంతో అభివృద్ధి నినాదంతో మోదీ, షా టూర్లతో ప్రచారాన్ని కమలదళం హోరెత్తిస్తోంది.
యూపీలో యోగి ఆదిత్యానాధ్ కేంద్రంగా పాలన సాగుతుండటం సీనియర్ నేతలను సైతం పక్కనపెడుతున్న పరిస్ధితి కాషాయ కూటమిలో కాక రేగుతున్నది. ప్రతి చిన్న పనికీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మంత్రులు సీఎం ఆమోదముద్ర కోసం వేచిచూడాల్సిన స్ధితి నెలకొంది. డిప్యూటీ సీఎంలను సైతం యోగి ఆదిత్యానాధ్ పక్కనపెడుతున్నారనే ప్రచారం సాగుతోంది.
వివాదాస్పద సాగు చట్టాలు, సీఏఏపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూపీ కేంద్రంగా నిరసనలు మిన్నంటాయి. సీఏఏపై నిరసనలతో యూపీ అట్టుడకగా ఆపై సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతల ఆందోళనకు యూపీ కేంద్ర బిందువైంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ బహిరంగంగా ప్రకటించారు. లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి కుమారుడి వాహనం దూసుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం మెట్టుదిగినా కేంద్ర చట్టాలపై నిరసనల ప్రభావం యూపీ అసెంబ్లీ ఎన్నికలపై పడనుంది.
యోగి సర్కార్లో ఆయన సామాజికవర్గం ఠాకూర్లు (రాజ్పుత్) పెత్తనం చెలాయిస్తున్నారని, తమకు ప్రాధాన్యం కొరవడిందనే ఆవేదనలో బ్రాహ్మణులు రగిలిపోతున్నారు. జితిన్ ప్రసాద వంటి బ్రాహ్మణ నేతలను చేర్చుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తున్నా యోగి హయాంలో ఠాకూర్ రాజ్ నడుస్తోందని బ్రాహ్మణులు భగ్గుమంటున్నారు. బ్రాహ్మణులను ఆకట్టుకునేందుకు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లు ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నాయి. యూపీలో 12 శాతంపైగా ఉన్న బ్రాహ్మణులు బీజేపీకి దూరమైతే హిందూ ఓట్లలో భారీ గండిపడుతుందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.