Omicron BF.7 | ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. పొరుగుదేశం చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదల ప్రధాన కారణం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 భావిస్తున్నారు. అయితే, BF.7 వేరియంట్ కేసులు ఇప్పటి వరకు భారత్లో మూడు గుర్తించినట్లు అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ వేరియంట్ తొలిసారిగా భారత్లో గుర్తించారు. గత అక్టోబర్లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ BF.7 వేరియంట్ను గుర్తించారు. ఇప్పటి వరకు గుజరాత్లో రెండు కేసులు, ఒడిశాలో ఒక కేసు నమోదైంది ఓ అధికారి తెలిపారు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. చైనాలోని పలు నగరాల్లో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ వేరియంట్ కారణమని, ఎక్కువగా బీజింగ్లో బీఎఫ్.7 వేరియంట్ కారణమని పేర్కొంటున్నారు. వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, టీకాలు వేసిన వారికి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ వేరియంట్ ఇప్పటికే యూఎస్, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ సహా పలు యూరోపియన్ దేశాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ఇవాళ విదేశాల్లో కొవిడ్ పరిస్థితులపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిపుణులు మాట్లాడుతూ ప్రస్తుతం కొవిడ్ కేసుల పెరుగుదల లేనప్పటకిరీ.. అభివృద్ధి చెందుతుందన్న వేరియంట్లను ట్రాక్ చేసేందుకు నిరంతర నిఘా అవసరమని అభిప్రాయపడ్డారు.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్లు ధరించాలని కేంద్రం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదని పేర్కొంది. విదేశాల నుంచి రాకపోకలపై ప్రస్తుతానికైతే ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్ కేసులు అదుపులోనే ఉన్నాయని, క్రియాశీల కేసులు ఐదువేలకు దిగువనే ఉన్నాయని వివరించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికాల్లో దేశాల్లో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో కొవిడ్ కేసుల సంఖ్య మొత్తం 10కోట్లు దాటిందని కేంద్రం వివరించింది.