శ్రీనగర్: ఆర్మీ వాహనం బోల్తాపడిన ఘటనలో ముగ్గురు సైనికులు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. షోపియాన్లోని బడిగామ్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గురువారం ఎన్కౌంటర్ జరిగింది. దీంతో అదనపు బలగాలను అక్కడకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్తున్న ఆర్మీ వాహనం కనిపోరా గ్రామం సమీపంలో బోల్తా పడిందని రక్షణ శాఖకు చెందిన శ్రీనగర్ పీఆర్వో తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు సైనికులు గాయపడినట్లు చెప్పారు. రహదారి తడిగా ఉండటంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. దీంతో ఆ వాహనం రోడ్డు నుంచి లోయలోకి జారిపోయిందని వివరించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మంది సైనికులను షోపియాన్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ పీఆర్వో తెలిపారు. ఇద్దరు మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించగా, చికిత్స పొందుతూ మరో సైనికుడు చనిపోయినట్లు పేర్కొన్నారు. గాయపడిన మిగతా ఐదుగురు సైనికులను శ్రీనగర్లోని బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
మరోవైపు రాళ్ల దాడి వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సమాచారం అవాస్తవమని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. పుకార్లను నమ్మవద్దని, శాంతియుతంగా ఉండాలని సూచించారు.