Tamil Politics : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (TVK) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు అందజేశారు.
అనంతరం మంత్రి ఆధవ్ అర్జునను కలిసి వారు టీవీకేలో చేరారు. ఈ ముగ్గురు నేతలు అన్నాడీఎంకేలోని మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గానికి సన్నిహితులుగా పేరుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజారిటీకి కొన్ని స్థానాలు తగ్గడంతో కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వేలుమణి వర్గానికి చెందిన 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష సందర్బంగా తేలింది.
తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు గుడ్బై చెప్పడంతో.. భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి మరిన్ని వికెట్లు పడతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా ఇప్పటికే సీఎం విజయ్ తిరుచ్చి తూర్పు స్థానానికి రాజీనామా చేయగా.. ఇప్పుడు ఈ ముగ్గురి రాజీనామాలతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య నాలుగుకు చేరింది. దాంతో త్వరలో జరగబోయే ఉపఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.