హైదరాబాద్ : జవాద్ తుఫాను నేపథ్యంలో భారతీయ రైల్వేశాఖ పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. గురు, శుక్ర, శనివారాల్లో నడవాల్సిన 95 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం పక్కనే ఉన్న అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నది.
అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదిలి శుక్రవారం ఉదయంలోగా అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో తుఫానుగా మారి శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో రైల్వేశాఖ ముందస్తుగా రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ తెలిపారు.