న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: సీటు కేటాయింపుపై విమానయాన సంస్థ లు అదనపు రుసుములు వసూలు చేస్తుండటంపై వేలాది మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అమల్లోకి తేవాలని ‘లోకల్ సర్కిల్స్’ సర్వేలో 48% మంది అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీటు కేటాయింపుపై 35 శాతం అదనంగా చెల్లించామని గత 12 నెలలుగా విమాన ప్రయాణాలు చేసినవాళ్లలో 51 శాతం మంది సర్వేలో వెల్లడించారు. విమాన ప్రయాణంలో సీటు బుక్ చేసుకున్నప్పుడు రూ.200 నుంచి 1500 వరకు అదనపు రుసుములు విధించటాన్ని పార్లమెంటరీ ప్యానెల్ కూడా తప్పుబట్టింది. ఏకపక్షం, సమర్థనీయం కాదంటూ, విమానయాన సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై గత ఏడాది పార్లమెంట్కు ఓ నివేదికను అందజేసింది.