PM Modi | హైదరాబాద్, డిసెంబర్ 16 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకొని ఓ రహస్య సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని అమెరికా వార్తాపత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ ఓ పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది. 2020లో ‘డిస్ఇన్ఫో ల్యాబ్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ సంస్థను 39 ఏండ్ల లెఫ్టినెంట్ కల్నల్ దివ్య సత్పాతి నడిపిస్తున్నట్టు తెలిపింది. ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించే అమెరికాకు చెందిన అధికారులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, భారత్-అమెరికా హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారంతో కూడిన కించపరిచే పోస్టులను డిస్ఇన్ఫో ల్యాబ్ సంస్థ ప్రచారం చేస్తున్నట్టు ఆరోపించింది. ప్రముఖ సామాజిక వేదిక ‘ఎక్స్’లో ఈ సంస్థ పోస్ట్ చేసిన దాదాపు లక్ష పోస్టులను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్టు పత్రిక వివరించింది.
తమ సంస్థ ఎవరికీ అనుకూలంగా వ్యవహరించబోదని చెప్పుకొనే డిస్ఇన్ఫో ల్యాబ్.. బీజేపీకి బాకా ఊదేలా పనిచేస్తున్నదని పత్రిక ఆరోపించింది. సంస్థను నిర్వహిస్తున్న దివ్యకు భారత విదేశీ నిఘా ఏజెన్సీ, మిలిటరీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)తో పాటు బీజేపీకి చెందిన కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నట్టు వివరించింది. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమవ్వడం, దళితులపై దేశంలో పెరుగుతున్న దాడులపై ప్రశ్నించిన అమెరికాకు చెందిన హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా, వారిని కించపరిచే విధంగా పలు అసత్య వార్తలను ఈ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని పత్రిక ఆరోపించింది. వాటిని ఇక్కడి బీజేపీ పరివారం విస్తృతంగా ప్రచారం చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించినట్టు వెల్లడించింది. ఇదే అంశంపై డిస్ఇన్ఫో ల్యాబ్తో పాటు, భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తే, ఎలాంటి సమాధానం రాలేదని పత్రిక వివరించింది.