న్యూఢిల్లీ, నవంబర్ 26: రాజ్యాంగ ఏకైక నిర్మాతగా పార్లమెంట్ ఆధిపత్యం ప్రశ్నించలేనిదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. పార్లమెంట్ అధికారాలపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ధన్కర్ మాట్లాడుతూ దేశ నిరంతర అభివృద్ధి కోసం కార్యనిర్వాహక, న్యాయ, శాసన వ్యవస్థలు సహకారంతో పని చేయాలని, ఘర్షణాత్మక రూపంలో కాదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు పార్లమెంట్ చట్టాన్ని రూపొందించలేదని, అదే విధంగా సుప్రీంకోర్టుకు శాసన వ్యవస్థ తీర్పులు రాసివ్వలేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సార్వభౌమాధికారం దేశ సార్వభౌమాధికారానికి పర్యాయ పదమని, అది అజేయమని ధన్కర్ అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక పరిధిలోకి చొరబడటం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని.. ప్రజాస్వామ్య సారాంశం, విలువలకు అది విరుద్ధమని పేర్కొన్నారు. కార్యనిర్వాహక, న్యాయ, శాసన వ్యవస్థలు తమ పరిధిలోనే పని చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నదని ధన్కర్ ఈ సందర్భంగా అన్నారు.