అవి అశ్లీలతను అడ్డుకుంటాయా?
ఓటీటీ నియంత్రణ మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
న్యూఢిల్లీ, మార్చి 5: సోషల్, డిజిటల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేసే మాధ్యమాలపై తీసుకునే చర్యలను మార్గదర్శకాల్లో పేర్కొనలేదని మండిపడింది. అలాంటప్పుడు అశ్లీల, విశృంఖల కంటెంట్ ఎలా ఆగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మార్గదర్శకాలను కోరలు లేని వాటిగా అభివర్ణించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీ (కేంద్ర ప్రభుత్వం) మార్గదర్శకాలను మేము అధ్యయనం చేశాం. అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేసిన మాధ్యమాలపై చట్టపరమైన విచారణ చేపట్టేందుకు కావల్సిన అధికారం, నిబంధనలను అందులో పేర్కొనలేదు. వాటికి కోరలు లేవు’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిచ్చారు. ఆ వివరాలను కోర్టుకు సమర్పిస్తామన్నారు.
‘తాండవ్’ వెబ్సిరీస్ కేసులో అమెజాన్ ప్రైమ్ వీడియో భారత విభాగ డైరెక్టర్ అపర్ణ పురోహిత్కు ఊరట లభించింది. ఆమెను పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.