చండీగఢ్: కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Khattar) సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న వారు రైతులు కాదని అన్నారు. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వారు కేంద్రం, హర్యానా ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘పంజాబ్కు చెందిన కొందరు రైతుల వేషధారణలో తిరుగుబాటు ప్రారంభించారు. కేంద్రం, హర్యానా ప్రభుత్వాలను గద్దె దించడమే దీని వెనుక ఉద్దేశం. ఆ మారువేషంలో ఉన్న వ్యక్తులు ట్రాక్టర్లతో రాజధాని ఢిల్లీకి చేరుకుని ఎర్రకోటపై కూడా దాడి చేశారు. వారు రైతులు కాదు’ అని మీడియాతో అన్నారు.
కాగా, రైతుల నిరసనపై మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందించారు. ‘ఖట్టర్ సీఎంగా ఉన్నంత కాలం తమకు ఒక్క సీటు కూడా రాదని బీజేపీ అర్థం చేసుకున్నది. అందుకే ఖట్టర్ సాహబ్ను సీఎం పదవి నుంచి తొలగించారు’ అని ఎద్దేవా చేశారు.
మరోవైపు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కు చట్టపరమైన హామీతోపాలు పలు డిమాండ్ల కోసం రైతులు నిరసన చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ బాట పట్టిన పంజాబ్ రైతులను హర్యానాలోని శంభు సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు నాటి నుంచి శంభు సరిహద్దు వద్ద మకాం వేశారు. ఆగస్ట్ 31 నాటికి రైతుల నిరసన 200 రోజులకు చేరింది.