చెన్నై: భారీ వర్షాలకు వరద నీటిలో శ్మశానవాటికలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరణించిన వారి మృతదేహాలకు మొబైల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు (mobile cremator) నిర్వహిస్తున్నారు. తమిళనాడులో ఈ పరిస్థితి నెలకొన్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూత్తుకుడిలో పలు వర్గాలకు కేటాయించిన 12 శ్మశానవాటికలు నీట మునగడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో స్థానికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించారు. మరణించిన హిందూ వ్యక్తుల మృతదేహాలకు రోడ్డు పక్కనే మొబైల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ దహనవాటికకు రెండు గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు.
కాగా, తూత్తుకుడిలోని అన్ని శ్మశానవాటికలు రెండు అడుగుల మేర నీటిలో మునిగినట్టు స్థానికులు తెలిపారు. దీంతో కొంతమంది తమ వారి మృతదేహాలను సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. మృతదేహాలను ఖననం చేయడానికి తిరువణ్ణామలై లేదా కోవిల్పట్టిలోని శ్మశాన వాటికలకు తరలిస్తున్నారని వెల్లడించారు. హిందువులకు మరో మార్గం లేకపోవడంతో కదిలే దహనవాటికను వినియోగిస్తున్నారని వివరించారు. అయితే నీరు పూర్తిగా తగ్గినప్పటికీ స్థానిక శ్మశానాల్లో మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు అవి అనువుగా ఉండాలంటే మరో ఐదు నెలలు పడుతుందని అన్నారు.