న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొన్ని రెస్టారెంట్లు దివ్యాంగులతో సేవలు అందిస్తుంటాయి. పరిశ్రమలో వారికి సరైన స్ధానం కల్పిస్తూ ఉపాధి మార్గం రూపంలో ఊతమిస్తుంటాయి. దివ్యాంగులు సైతం వైకల్యాన్ని పక్కనపెట్టి అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక పూణేలోని ఓ రెస్టారెంట్ దివ్యాంగులను సిబ్బందిగా నియమించింది. పుణే ఫుడీస్ అనే ఫుడ్ బ్లాగింగ్ పేజ్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టెరాసినె పేరున్న రెస్టారెంట్లో దివ్యాంగుల సేవలను ఈ వీడియో మన కండ్లకు కడుతోంది. ఈ వీడియోకు ఏకంగా 7.1 లక్షల లైక్లు రాగా, పెద్దసంఖ్యలో నెటిజన్లు ఈ రెస్టారెంట్ను తమకు పరిచయం చేసిన ఫుడ్ బ్లాగర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఓ మహిళ ఈటరీలోకి ఎంట్రీ ఇస్తూ సైగల ద్వారా ఆర్డర్ ఇవ్వడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది.
మెనూ కార్డులోనూ ప్రతి ఫుడ్ ఐటెం వద్ద సైన్ ల్యాంగ్వేజ్ సింబల్ ఇచ్చారు. రెస్టారెంట్ సిబ్బంది ఫుడ్ను సర్వ్ చేస్తూ మహిళ అభిప్రాయాన్ని అడుగుతుండటం కనిపిస్తోంది. ఈ రెస్టారెంట్ మూగ, చెవిటి సిబ్బందితో నడిపిస్తున్నారు..భారత్లో దివ్యాంగులతో నడిచే తొలి రెస్టారెంట్ ఇదే..ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్, లండన్ వారిచే ఈ రెస్టారెంట్ అవార్డు పొందిందని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.