(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు పెడుతుందని గప్పాలు కొట్టుకొనే బీజేపీ నేతల మాటలు నీటి మూటలేనని మరో ఘటన రుజువు చేస్తున్నది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో యోగి సర్కారు గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకుండా బడుగు ఉద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నది. లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఆర్ఎంఎల్ఐఎంఎస్) ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న ఏడుగురు మహిళలతో సహా 43 మంది సెక్యూరిటీ గార్డులకు గత ఏడాది జూన్ నుంచి జీతాలు లేవు.
వేతనాల చెల్లించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్కు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాకపోవడంతో కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో బతుకుతున్నామని ప్రదీప్ యాదవ్ అనే సెక్యూరిటీ గార్డు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి కిరాయి చెల్లించకపోవడంతో ఇంటి ఓనరు ఇంట్లోకి రానివ్వటంలేదని, దీంతో దవాఖాన గేటు బయటే రాత్రి పడుకుంటున్నానని తెలిపాడు. నెలనెలా జీతాలు ఇవ్వకపోవడమే కాక, జీతాల చెల్లింపు విధానంలో కూడా అవకతవకలున్నాయని వారు ఆరోపించారు. జీతాల చెల్లింపుపై కాలయాపన చేస్తున్నారని, వెంటనే స్పందించి జీతాలు ఇవ్వకుంటే తాము మూకుమ్మడిగా విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.