న్యూఢిల్లీ, జూన్ 16: తమ పార్టీలో చీలికకు జేడీయూ కారణమని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని వర్గం తీసుకున్న నిర్ణయాలను తోసిపుచ్చారు. తమ పార్టీ రాజ్యాంగం ప్రకారం వారికి నిర్ణయాధికారం లేదని చెప్పారు. ఎల్జేపీలో చీలిక అనంతరం తొలిసారిగా బుధవారం చిరాగ్ విలేకరులతో మాట్లాడారు. తనను తాను పులిబిడ్డగా అభివర్ణించుకున్న చిరాగ్… తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించిన పార్టీ కోసం పోరాడుతానని చెప్పారు. పార్టీ చీలికలో బీజేపీ పాత్రపై ఆయన ఎలాంటి ఆరోపణలు చేయలేదు.
లోక్సభ స్పీకర్కు లేఖ
లోక్సభలో ఎల్జేపీ పక్ష నేతగా పశుపతి కుమార్ పరాస్ను ప్రకటించడం తగదని ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. ‘మా పార్టీకి ఆరుగురు ఎంపీలు ఉండగా.. వారిలో ఐదుగురు పార్టీ నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారిని పార్టీ నుంచి బహిష్కరించాం. వారిలో ఒకరైన పశుపతిని ఎల్జేపీ పక్ష నేతగా ప్రకటించడం తగదు. తిరిగి నన్ను ఎల్జేపీ నేతగా ప్రకటించండ’ని కోరారు.