బెంగళూరు: ఇప్పటి వరకు మనం డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలను ఉపయోగిస్తున్నాం. తాజాగా వేడి వేడి ఇడ్లీలు అందించే ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటక రాజధానిలో ఒక స్టార్టప్ కంపెనీ ‘ఇడ్లీ ఏటీఎం’లను ఏర్పాటు చేసింది. బెంగళూరుకు చెందిన శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్లు స్థాపించిన స్టార్టప్ ఫ్రెషప్ రోబోటిక్స్, ఇన్స్టెంట్ ఇడ్లీ తయారు యంత్రాన్ని రూపొందించింది. ఇరవై నాలుగు గంటలు వేడి వేడి ఇడ్లీలు అందించే ఈ ఏటీఎంను ఫ్రెషాట్లో ఏర్పాటు చేశారు. ఇది కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలు తయారు చేయగలదు. చట్నీ, కారప్పొడి వంటి వాటితో ఇడ్లీలను ప్యాక్ చేసి కస్టమర్లకు అందిస్తుంది.
ఈ ఏటీఎం ద్వారా వేడి వేడి ఇడ్లీలు పొందడం కూడా చాలా సులువే. ఏటీఎం వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేయాలి. దీంతో మెనూ కనిపిస్తుంది. ఇడ్లీలు ఆర్డర్ చేసి డబ్బులను ఆన్లైన్లో చెల్లించాలి. దీంతో నిమిషంలోపే (సుమారు 55 సెకన్లలో) చట్నీతో కూడిన ఇడ్లీ ప్యాక్ ఆ ఏటీఎం నుంచి బయటకు వస్తుంది. తీసుకుని ప్యాక్ తెరిచి ఇడ్లీలు తినడమే తరువాయి.
కాగా, వెరైటీగా ఉన్నఈ ఇడ్లీ ఏటీఎం ఆలోచన తనకు ఎలా వచ్చిందో అన్నది శరణ్ హిరేమత్ వివరించారు. 2016లో తన కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు అర్థరాత్రి వేళ ఎక్కడా వేడి వేడి ఇడ్లీలు లభించక ఇబ్బంది పడినట్లు చెప్పారు. అందుకే 24 గంటలపాటూ తాజాగా ఇడ్లీలు తయారు చేసే ఏటీఎం యంత్రాన్ని రూపొందించాలన్న ఆలోచన వచ్చిందన్నారు.
మరోవైపు అల్పాహారం కోసం దక్షిణ భారత్లో ఏర్పాటు చేసిన తొలి ఆటోమేటెడ్ కుకింగ్, పంపిణీ యంత్రం ఇదేనని హిరేమత్ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులోని రెండు చోట్ల ఇడ్లీ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని మరింతగా విస్తరించడంతోపాటు దోస, రైస్, జ్యూస్ వంటి ఏటీఎంలను కూడా అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, వేడి వేడిగా ఇడ్లీలు అందించే వినూత్న ఏటీఎం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Idli ATM in Bangalore… pic.twitter.com/NvI7GuZP6Y
— B Padmanaban (padmanaban@fortuneinvestment.in) (@padhucfp) October 13, 2022