న్యూఢిల్లీ, ఆగస్టు 27: రైల్వే స్టేషన్లలో ప్రయాణికులపై ఓ కన్నేసి ఉంచేందుకు సుమారు 500 ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల’ను రైల్వే శాఖ అమర్చింది. ఇవి ముంబైతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో 30 రైల్వే స్టేషన్లలో నెల రోజులుగా పనిచేస్తున్నాయి. ఈ టెక్నాలజీని రష్యాకు చెందిన ‘ఎన్టెక్ ల్యాబ్’ ఓ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ‘సింగిల్ ఫ్రేమ్లో 50 మందిని ఈ కెమెరాలు గుర్తించగలవు. వారు మాస్కులు ధరించి ఉన్నా సరే పోల్చుకుంటాయి. ఏ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎలా ఉందో చెప్పగలవు. అంతేకాదు నేరస్థులను గుర్తుపడుతాయి. లైవ్ ఫుటేజీ ద్వారా ఎవరైనా వ్యక్తుల జాడను చెప్పగలవు’ అని కెమెరాల ప్రత్యేకతను ఆ సంస్థ వివరించింది. అలాగే ‘జాతీయ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్’ పేరిట దేశవ్యాప్తంగా ఒక సమగ్ర కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం టెండర్లు పిలుస్తున్నట్టు సమాచారం. ఇలాంటి కెమెరాలు, నిఘా వ్యవస్థ పౌరుల ప్రైవసీని, స్వేచ్ఛను హరిస్తాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన సభలో పాల్గొన్న వెయ్యి మంది రైతులను గుర్తించి అరెస్టు చేయడానికి ఇటీవల పోలీసులు త్రినేత్ర పేరిట ఇలాంటి నిఘా కెమెరాలనే ఉపయోగించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.