Tenth Exams | చదువుకోవాలనే కసి ఉంటే ఏ కష్టం అడ్డురాదు. కొంత సమయం పడుతుండొచ్చు కానీ అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించొచ్చు. ఈ వృద్ధుడే అందుకు ఆదర్శం.. నిదర్శనం. పది పాస్ అవుతానని 20 ఏండ్ల వయసులో ప్రతిజ్ఞ చేసి 70 ఏండ్ల వయసులో పాస్ అయ్యాడు. మరి పది పాస్ అయ్యేందుకు ఏకంగా 56 సార్లు ఎగ్జామ్స్ రాశాడు. ఎట్టకేలకు 77 ఏండ్ల వయసులో పదిలో ఉత్తీర్ణత సాధించి, తన కలను నెరవేర్చుకున్నాడు.
రాజస్థాన్లోని జలోర్కు చెందిన హుకుందాస్ వైష్ణవ్(77) 1945లో జన్మించారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు టీకీ విలేజ్లో చదివారు. 1962లో తొలిసారిగా పదో తరగతి పరీక్షలు రాశారు. కానీ ఫెయిలయ్యాడు. దీంతో మళ్లీ సప్టిమెంటరీ పరీక్షలు రాశాడు. రెండో సారి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. ఇక వైష్ణవ్ ఎప్పటికీ పది పాస్ కాలేడని అతని స్నేహితులు ఎగతాళి చేశారు.
తనను అవమానించి, హేళన చేసిన స్నేహితుల ముందే వైష్ణవ్ ప్రతిజ్ఞ చేశాడు. ఏదో ఒకరోజు తాను తప్పకుండా పది పాస్ అవుతానని, అందుకు కష్టపడుతానని వైష్ణవ్ ప్రతినబూనాడు. ఇక అందుకోసం గట్టిగా కష్టపడ్డాడు. పది ఫెయిలైన ప్రతిసారి ఆయన కుంగిపోలేదు. కచ్చితంగా పది పాస్ కావాలనే సంకల్పంతో.. ఏకంగా 55 సార్లు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాడు. 56వ సారి వైష్ణవ్ పదిలో ఉత్తీర్ణత సాధించి.. ఆదర్శంగా నిలిచాడు. అయితే 2010లో చివరిసారిగా 48వ సారి టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. 2019లో స్టేట్ ఓపెన్ బోర్డు నిర్వహించిన పది పరీక్షల్లో సెకండ్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించాడు.
20 ఏండ్ల వయసులోనే వైష్ణవ్కు రాజస్థాన్ ప్రభుత్వంలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విభాగంలో నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేశారు. 2005లో ట్రెజరీ డిపార్ట్మెంట్లో నాలుగో తరగతి ఉద్యోగిగా పదవీ విరమణ పొందారు. ఇక 2021-22 విద్యాసంవత్సరంలో వైష్ణవ్ 12వ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఈయన మనుమడు కూడా పాఠశాల విద్య ఇటీవలే పూర్తి చేశాడు.