పాట్నా, నవంబర్ 25: బీహార్లో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రైలింజన్లు, వంతెనలు ఎత్తుకుపోతూ చౌర్యంలో కొత్త పోకడలు పోతున్నారు. ఇటీవల ముజఫర్పూర్లోని ఓ ఇనుప తుక్కు గోడౌన్పై పోలీసులు దాడి చేసినప్పుడు 13 బస్తాల రైలింజన్ విడిభాగాలు పట్టుబడ్డాయి. దొంగలు దేన్నీ వదిలిపెట్టడం లేదు. చివరకు పాతకాలంనాటి వారసత్వ సంపదలో భాగమైన ఇంజన్లనూ ఎత్తుకుపోయి ముక్కలు కొట్టి అమ్ముకొంటున్నారు.
బరౌనీలోని గడారా యార్డుకు రిపేర్ల నిమిత్తం తరలించిన డీజిల్ ఇంజిన్ భాగాలను దొంగలు ఎత్తుకొని పోయారు. అందుకు వారు ఓ సొరంగం తవ్వడం గమనార్హం. ఆ సొరంగం గుండా యార్డులోకి ప్రవేశించిన దొంగలు ఇంజిన్లను విప్పి విడిభాగాలను బస్తాల్లో వేసుకుని తీసుకుపోయారు. అయితే దొంగలే కాదు, అధికారులూ చేతివాటం చూపిస్తుండటం విశేషం. గత ఏడాది సమస్తిపూర్ లోకో డివిజన్కు చెందిన ఓ రైల్వే ఇంజినీర్ పూర్ణియా కోర్టు ఆవరణలో ఉంచిన పాత ఆవిరి ఇంజిన్ను అమ్మేసుకోవడం సంచలనం కలిగించింది.