న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీకి, ఈసారి పంజాబ్లో పాగా వేయాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాము పంజాబ్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ఇటీవల కేజ్రివాల్ ప్రకటించారు. దీనిపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్.. ఇవాళ జలంధర్లో ఓ సభలో మాట్లాడుతూ.. పంజాబ్ కాంగ్రెస్ నేతల పేర్లు ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు.
’18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల నేను ప్రకటించాను. నేను ఆ ప్రకటన చేసినప్పటి నుంచి వాళ్లు (పంజాబ్ కాంగ్రెస్ నేతలు) నాకు శాపనార్థాలు పెడుతున్నారు. నేను వాళ్లని ఒక్కటే అడుగుతున్నా. మహిళలకు నెలకు రూ.1000 ఇవ్వమంటున్నారా వద్దంటున్నారా..?’ అని కేజ్రివాల్ ప్రశ్నించారు. వాళ్ల శాపనార్థాలు వింటుంటే, తనకే తానేమైనా తప్పుచేశానా..? అనే సందేహం కలుగుతున్నదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.