రాంచి: బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా తనకు వచ్చిన నష్టమేమీ లేదని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు. తన మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు వాళ్లు (బీజేపీ అగ్ర నాయకులు) కుట్ర పన్నారని సోరెన్ ఆరోపించారు. వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా తన ఇమేజ్ను డామేజ్ చేయడంగానీ, రాజకీయ శక్తిని తగ్గించడంగానీ వాళ్లవల్ల కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ వైఖరిని ప్రజలు పసిగడుతున్నారని హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. కాబట్టి ఆ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా జార్ఖండ్లో తమ పార్టీ బలం తగ్గదన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో తమకు 52 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్యాబలం 75కు చేరుతుందని సోరెన్ ధీమా వ్యక్తంచేశారు.
ఇటీవల అక్రమ మైనింగ్ కేసులో సోరెన్కు ఈడీ నోటీసులు పంపింది. కానీ సోరెన్ ఆ నోటీసులను పట్టించుకోలేదు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.