న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి యాత్రను ఆపడానికి బీజేపీ కుట్రలు చేస్తూనే ఉన్నదని ఆయన ఆరోపించారు. తన యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి బీజేపీ నేతలు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే ఎన్నో విధాలుగా యాత్రను ఆపడానికి ప్రయత్నించి విఫలమైన బీజేపీ నేతలు.. ఇప్పుడు కరోనా మహమ్మారి పేరుతో తన యాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ బయటపడినందున యాత్రలో కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, లేదంటే యాత్రను నిలిపేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ రాహుల్గాంధీకి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో ఆ లేఖపై మాట్లాడుతూ.. రాహుల్గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. ఎలాగైనా తన పాదయాత్రను ఆపడానికి బీజేపీ కుంటిసాకులు వెతుకుతున్నదని రాహుల్గాంధీ ఎద్దేవా చేశారు. కాగా, కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్ర కశ్మీర్లో ముగియనుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. తాజాగా రాజస్థాన్లో కూడా రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది.