న్యూఢిల్లీ: కర్నాల్లో ఆందోళన చేస్తున్న రైతులపై శనివారం హర్యానా పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయిత్ తీవ్రంగా ఖండించారు. లాఠీచార్జి జరుగుతుండగా రైతుల తలలు పగులగొట్టాలంటూ ఓ ఉన్నతాధికారి పోలీసులను ఆదేశించడం వినిపించిందని, ఆ అధికారిని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాలని తికాయత్ డిమాండ్ చేశారు. రైతులపై లాఠీలు ఝలిపించడం చూస్తుంటే దేశం సర్కారీ తాలిబన్ల ఆధీనంలో ఉన్నట్లు అనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అదేవిధంగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీకి జాతీయజెండా అంటే గౌరవం లేదని రాకేష్ తికాయత్ మండిపడ్డారు. ఇటీవల కళ్యాణ్సింగ్ భౌతిక కాయంపై జాతీయ జెండాను కప్పిన అనంతరం, బీజేపీ నేతలు దానిపై తమ పార్టీ జెండాను కప్పారని, జాతీయ జెండాపై వాళ్లకు ఏపాటి గౌరవం ఉన్నదో దీన్నిబట్టే చెప్పవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. రైతులపై లాఠీచార్జి చేయించిన తీరును బట్టి హర్యనా సీఎం మనోహర్లాల్ కట్టర్ జనరల్ డయ్యర్ను తలపిస్తున్నారని విమర్శించారు.