కోల్కతా: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నలుగురు ఎంపీలతో ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ (Fact finding committee)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి తీవ్ర విమర్శలు గుప్పించారు.
నిజనిర్ధారణ పేరుతో గత రెండేళ్ల కాలంలో బెంగాల్ మీదకు బీజేపీ దగ్గరదగ్గర 154 కమిటీలను పంపిందని, వాస్తవానికి అవి నిజనిర్ధారణ కమిటీలు కావని, బీజేపీకి చెందిన రెచ్చగొట్టే కమిటీలని మమత మండిపడ్డారు. మణిపూర్లో, అస్సాంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఈ నిజనిర్ధారణ కమిటీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో 19 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాను పోలీసులను ఆదేశించానని మమత చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని, కుటుంబంలో ఒక్కరికి చొప్పున 19 మందికి స్పెషల్ హోంగార్డు ఉద్యోగాలు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు.
మృతుల్లో 10 మంది తృణమూల్ పార్టీవాళ్లు ఉన్నారని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం విషయంలో తాము తరతమ భేదాలు చూపించడంలేదని, పార్టీలకు అతీతంగా అందరికీ సమ న్యాయం చేస్తామని మమత తెలిపారు. కాగా, బెంగాల్లో హింసాత్మక ఘటనలపై విచారణకు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో వేసిన నిజనిర్ధారణ కమిటీ విచారణ పూర్తైన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక సమర్పించనుంది.