Prasant Kishore | ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ ఓటమి పాలవ్వడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన విషయాలు చెప్పారు. అధికార బీజేపీని, ప్రధాని నరేంద్రమోదీ లేదా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను ఢీ కొట్టేందుకు సమర్థవంతమైన వ్యూహమేదీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అమలు చేయలేదని తేల్చి చెప్పారు. యూపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల ముందు విశ్వసనీయమైన నేతను విపక్షాలు నిలపలేక పోయాయన్నారు.
అధికార బీజేపీని ఎదుర్కోవడంలో సమాజ్వాదీ పార్టీ ప్రచారం పూర్తిగా విఫలమైందని ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ చెప్పారు. బీజేపీకి, మోదీ, యోగిలను ఢీ కొట్టడానికి పోటీ వ్యూహమే లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు.. సమాజ్వాదీ పార్టీ చేసిన పొరపాటు అదేనన్నారు. యూపీలో శక్తిమంతమైన పార్టీ ఎస్పీ.. బీజేపీకి చాలెంజర్ అని చెప్పారు.
ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందు సంప్రదాయ పద్దతిలో ప్రచారం జరిగింది. చరిస్మా గల నాయకుడిగా అఖిలేశ్ యాదవ్ తన పార్టీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించలేకపోయారని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఒకవేళ రెండు, మూడు నెలల ముందు మేల్కొంటే 200 సభల్లో పాల్గొనే వారు.. బీజేపీని ఢీకొట్టగలిగే వారు.. కానీ అది జరుగలేదన్నారు. బెంగాల్లో రెండేండ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచార యుద్ధం సాగింది. అందువల్లే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఆమె సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీని ఎన్నికల్లో ఓడించగలిగిందన్నారు.