రాయ్పూర్, మే 22: బాలీవుడ్ సినిమా కథకు ఏమాత్రం తీసిపోని విధంగా నిజ జీవితంలో ఓ వ్యక్తిపై కుట్ర జరిగింది. ఫలితం ఓ అమాయకుడు 20 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక తప్పుడు కేసులో 20 ఏండ్లు జైలు శిక్ష అనుభవించిన అబ్దుల్లా ఆయూబ్ను ఛత్తీస్గఢ్లోని ఓ న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటిస్తూ ఇటీవల విడుదల చేసింది. కోటి రూపాయల విలువజేసే మాదకద్రవ్యాలు(హెరాయిన్) కలిగివున్నాడన్న కేసులో మార్చి, 2003లో అబ్దుల్లా ఆయూబ్కు జైలు శిక్షపడగా, ఇది ఒక తప్పుడు కేసు, అతడి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నది సాధారణ పౌడర్ మాత్రమేనని 20 ఏండ్ల తర్వాత కోర్టు తేల్చింది.
రెండు దశాబ్దాల విలువైన జీవితకాలాల్ని కోల్పోయిన అబ్దుల్లా ఆయూబ్ కొద్దిరోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో చోటుచేసుకుంది. న్యాయస్థానం, అబ్దుల్లా ఆయూబ్ తరఫు న్యాయవాది చెప్పినదాని ప్రకారం బాధితుడిపై ఓ కానిస్టేబుల్ కుట్రకు పాల్పడ్డాడు. అదేంటంటే, ఇంటి కిరాయి ఇవ్వటం లేదని కానిస్టేబుల్ ఖుర్షిద్ను యజమాని అబ్దుల్లా ఖాళీ చేయించాడు. దీంతో అతడిపై పగబట్టిన ఖుర్షిద్, రాయ్పూర్లోని పురాని బస్తీ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి కుట్ర పన్నాడు. కోటి రూపాయల హెరాయిన్ కలిగివున్నాడన్న కేసులో అబ్దుల్లాని ఇరికించాడు. ఈకేసులో 2003, మార్చి 14న అబ్దుల్లాకు జైలు శిక్ష పడింది. తాను అమాయకుడ్ని అంటూ ఎంత మొత్తుకున్నా అతడి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అబ్దుల్లా నుంచి స్వాధీనం చేసుకున్న 25గ్రాముల పౌడర్ను లక్నోలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా, అది హెరాయిన్ కాదు..సాధారణ తెల్లపౌడర్ అన్న సంగతి కొన్నాళ్ల తర్వాత తేలింది.