బెంగళూరు, ఆగస్టు 26: జనావాసాల మధ్య ఉన్న నివాస గృహాల్లో ప్రార్థనల నిర్వహణపై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. నివాస గృహాలను ప్రార్థనలకు ఉపయోగించడాన్ని నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. భారత శిక్షాస్మృతిలోని చట్టాల్లో అలాంటివి నిరోధిస్తూ గానీ, నిషేధిస్తూ గానీ నిబంధనలు ఉన్నట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది చూపించలేకపోయారని, అందుకే కేసును కొట్టివేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలె, జస్టిస్ ఎంజీఎస్ కమల్ ధర్మాసనం తీర్పు చెప్పింది.
నివాస గృహంలో కొందరు నిర్వహిస్తున్న ప్రార్థనల వల్ల చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా ఉందని, రెసిడెన్షియల్ ప్రాంతంలో ఇలాంటి చర్యలను నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, అనుమతులు లేకుండా నిర్మించిన మదర్సాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సామ్ పి ఫిలిప్, కృష్ణ ఎస్కే, జగేసన్ టీపీ సహా హెచ్బీఆర్ లేఅవుట్కు చెందిన మరో ఐదుగురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు బీబీఎంసీ, మసీద్ ఈ-ఆష్రఫ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖను ప్రతివాదులుగా చేర్చారు. నివాస గృహాన్ని ప్రార్థనలకు ఉపయోగించరాదన్న తన వాదనకు పిటిషనర్లు చట్టపరంగా ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని, అలాగే అక్కడ ప్రార్థనలకు పెద్దయెత్తున హాజరవుతున్న జనం వల్ల చుట్టుపక్కల పౌరులకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నదన్న ఆరోపణను సైతం రుజువు చేయలేకపోయారని పేర్కొన్న ధర్మాసనం కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.