న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత ఉన్నదని ఫిర్యాదులు చేస్తున్నాయి. అయితే ఇండియాలో అతిపెద్ద ఆక్సిజన్ తయారీదారు ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్స్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. దేశంలోని మెడికల్ ఆక్సిజన్ మార్కెట్లో 50 శాతం ఈ సంస్థే తయారు చేస్తుంది. అయితే ప్రస్తుతం దేశానికి అవసరమైనంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్స్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ చెప్పారు.
అయితే మహారాష్ట్ర, గుజరాత్లలో కొవిడ్ కేసులు తగ్గకపోతేనే ఆందోళన చెందాల్సిన అవసరమున్నదని ఆయన అన్నారు. నిజానికి ఒడిశా, జార్ఖండ్లాంటి తూర్పు భారత రాష్ట్రాల్లో అవసరానికి మించిన సరఫరా ఉంది. అయితే డిమాండ్ మాత్రం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లాంటి పశ్చిమ భారత రాష్ట్రాల నుంచి వస్తోంది. ఇదే అసలు సమస్య అని జైన్ అన్నారు.
డిమాండ్ ఉన్న చోటుకు సరఫరా ఉన్న చోటు చాలా దూరంగా ఉండటం వల్లే ఈ కొరత ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ పేరుతో రైలు నడుపుతోంది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్కు డిమాండ్ పెరుగుతోంది. అయినా మేము దీనిని మేనేజ్ చేస్తున్నామని సిద్ధార్థ్ జైన్ స్పష్టం చేశారు.
ఈ సమస్య మహా అయితే నెల రోజులు ఉంటుందని, ప్రస్తుతం చాలా ఆక్సిజన్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. ఇండియా మొత్తంలో 40 వేల టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉన్నదని వెల్లడించారు. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో పారిశ్రామిక అవసరాల కోసం ఆక్సిజన్ సరఫరాను కేంద్రం నిషేధించింది.