Mizoram | ఐజ్వాల్, అక్టోబర్ 31: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ముక్కోణపు పోటీ నెలకొన్నది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) ఉన్నాయి. 2018కు ముందు వరుసగా రెండుసార్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ రాష్ట్రంలో తన ప్రభ కోల్పోయింది. 2013లో 40కి గానూ 34 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టిన హస్తం పార్టీ.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 5 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఓటు బ్యాంకు కూడా 44 శాతం నుంచి 29 శాతానికి పడిపోయింది. 2017లో ఏర్పాటైన జెడ్పీఎం 2018 ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఇక ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానం కుంచించుకుపోయింది. మిజోరంలో విశేషం ఏంటంటే.. కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, ఎంఎన్ఎఫ్ పార్టీలు, రాష్ట్రంలో మాత్రం వేర్వేరుగా పోటీచేస్తున్నాయి. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు రాలేని పక్షంలో కింగ్మేకర్గానైనా అవతరించాలని జెడ్పీఎం ఆశిస్తున్నది.
ఈ నెల 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్, జడ్పీఎం పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మిజోరంలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా క్రిస్టియన్లు మెజార్టీగా ఉండే మిజోరంలో బీజేపీ హిందూత్వ నుంచి తామే రాష్ర్టానికి రక్షణ కల్పించగలమని ప్రచారం చేస్తున్నది. బీజేపీ విద్వేష రాజకీయాలకు తామే అడ్డుకట్ట వేయగలమని చెప్పుకోవడం ద్వారా అది రాష్ట్రంలో తమ అధికార పునరుద్ధరణకు సహకరిస్తుందని హస్తం పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో పొరుగున ఉన్న బీజేపీ పాలిత మణిపూర్లో గత కొద్ది నెలలుగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో బీజేపీ సర్కార్ విఫలమైన విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్లాన్లో కాంగ్రెస్ ఉన్నది.
ఈ ఏడాది మే నుంచి మణిపూర్లో మైతీలు, కుకీ-జో కమ్యూనిటీ ప్రజల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కుకీ ప్రజలు మైనార్టీలుగా ఉన్నారు. మణిపూర్లోని కుకీ-జో వర్గానికి చెందిన వారితో మిజోలకు జాతిపరమైన బంధం ఉన్నది. దీంతో మణిపూర్ ఘర్షణల వ్యవహారం మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ మణిపూర్ సంక్షోభంలో తమ సోదరులు పడుతున్న కష్టాలను మిజోరం ప్రజలు అనుభవిస్తున్నారని, ఈశాన్య రాష్ట్ర సామాజిక నిర్మాణాన్ని బీజేపీ ఎలా నాశనం చేస్తుందనే దానికి మణిపూర్ ఒక సందేశమని అన్నారు.