ఎక్కడికక్కడ నదులు నిండుకుంటున్నాయి. ఎక్కడికక్కడ రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. ఏ సరస్సు చూసినా, చెరువు చూసినా.. అన్నీ నెర్రెలువారి కనిపిస్తున్నాయి. ఒక దేశంలోనో, ఒక ఖండంలోనో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికా అయినా, రవి అస్తమించని సామ్రాజ్యం యూకే అయినా, మరే దేశమైనా.. ప్రపంచమంతా నీటి కొరత తీవ్రంగా వేధిస్తున్నది. భవిష్యత్తులో నీళ్ల పరిస్థితి చమురులా తయారవుతుందని ప్రపంచవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి యుద్ధాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని హెచ్చరిస్తున్నారు. ఇన్నేండ్లు ఏ ఒక్క దేశమూ నీటి సమస్యను పట్టించుకోలేదు. ఇప్పటికైనా తేరుకోకపోతే మనం అతిపెద్ద ముప్పును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేస్తున్నారు.
న్యూఢిల్లీ, జూలై 9: నీళ్ల కోసం యుద్ధాలు.. అవును! భవిష్యత్తులో నీటి కోసమే యుద్ధం చేయాల్సి రావొచ్చు.. మనం తాగే గుక్కెడు నీటి కోసం ప్రాణాలను తీసే పరిస్థితి తలెత్తవచ్చు.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న నీటి కొరత దృష్ట్యా ప్రపంచవేత్తల అంచనాలివి. అమెరికా మొదలుకొని.. ఆఫ్రికా ఖండం, యూరోపియన్ దేశాలైన ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ తదితర దేశాలన్నీ అత్యంత కరువును ఎదుర్కొంటున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో నదులు, రిజర్వాయర్లు, సరస్సులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. ఈ మధ్యే నీటి కొరతపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు నీటి భద్రత అతిపెద్ద సమస్యగా పరిణమించే ప్రమాదం పొంచి ఉన్నదని వ్యాఖ్యానించారు. నీటి భద్రత కోసం వ్యూహం రచించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని వెల్లడించారు. అమెరికా సుస్థిరాభివృద్ధి, ఆర్థిక వృద్ధి జరగాలంటే నీటి భద్రత కచ్చితమని స్పష్టం చేశారు. కమలా హ్యారిస్ ప్రకారం.. 9 కోట్ల మంది అమెరికన్లు కరువు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులపైనా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నీటి కొరత ప్రపంచాన్ని అస్థిరపరుస్తుందని, అభద్రతలోకి నెడుతుందని వెల్లడించారు. నీటి వనరులు దేశాల మధ్య, వర్గాల మధ్య కొట్లాటలకు దారి తీస్తాయని, అవి పెరిగి పెరిగి యుద్ధాలకు దారి తీసే ప్రమాదం ఉన్నదని వివరించారు. ‘నీటి కొరత వల్ల ఆహారోత్పత్తి తగ్గుతుంది. ప్రజారోగ్యం కుంటుపడుతుంది. భారీ వలసలు చోటుచేసుకొంటాయి. పక్క దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొన్నారు.
ఆఫ్రికాలో అసలే పేదరికం ఎక్కువ. అలాంటిది ప్రస్తుతం ఆ దేశాలను నీటి కొరత తీవ్ర సమస్యగా మారింది. నీటి కొరత ఏ స్థాయిలో ఉన్నదంటే.. 40 ఏండ్ల కిందటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. కరువుతో లక్షల మంది ఆఫ్రికన్లు మృత్యువాతపడుతున్నారు. అమెరికా సర్వే ప్రకారం.. ఆఫ్రికాలో నీటి సమస్యను తీర్చేందుకు వందేండ్లలో ఏ ప్రభుత్వాలు చొరవతీసుకోలేదు. 2030 నాటికి ఆఫ్రికాలో నీళ్ల డిమాండ్ 283 శాతం పెరిగే అవకాశం ఉన్నది.
ఏటా ఎండాకాలంలో కరువుతో అల్లాడిపోయే దేశాలేవంటే ఆఫ్రికా దేశాలనే చెప్తాం. కానీ ఈ ఎండాకాలంలో కొంత వాటాను పశ్చిమ ఐరోపా దేశాలు కూడా పంచుకొన్నాయి. ఆ దేశాలను వడగాడ్పులు వణికిస్తున్నాయి. ఇటలీలో వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గుతూ వస్తున్నది. ఆ దేశంలో పొడవైన నది.. ‘పో’ మొత్తం ఎండిపోయింది. గత 70 ఏండ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. ఫలితంగా పంటలు పండక ఆహారోత్పత్తి తగ్గిపోతున్నది. నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని దాదాపు 100 నగరాల్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ఆ దేశం 37 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. వేరే నదులున్న చోట్లలో చాలా పంటలకు నీటి సరఫరాను తగ్గించింది. టైబర్, వెరోనా సిటీలో ఈ ఆగస్టు వరకు కార్లు కడగటం, తోటలకు నీళ్లు పట్టడం, స్విమ్మింగ్ పూల్స్లో నింపటంపై నిషేధం విధించారు. అతిక్రమిస్తే 516 డాలర్ల ఫైన్ విధిస్తున్నారు. ఫ్రాన్స్లోని దక్షిణ భూభాగం కూడా కరువును ఎదుర్కొనే పరిస్థితికి దగ్గరవుతున్నది. పోర్చుగల్లోనూ అదే పరిస్థితి. అక్కడి డ్యాంలన్నీ అడుగంటిపోయాయి. హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లు వారానికి రెండు గంటలే వాడాలని అక్కడి ప్రభుత్వం షరతు విధించింది. వ్యవసాయ ఆధారిత పట్టణాలు సిల్వెస్, లాగోవా, పోర్టిమావోల్లో పంటలను తగానికి తగ్గించేశారు. స్పెయిన్లో అయితే మూడింట రెండో వంతు భాగం ఎడారిమయమైపోయింది. నీటి వనరులు లేక సాగు భూములన్నీ మట్టిదిబ్బలా మారిపోతున్నాయి. ఈ పరిస్థితి 1961 తర్వాత ఇదే తొలిసారి.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే పసిగట్టిన తెలంగాణ.. దూరదృష్టితో వ్యవహరించింది. తెలంగాణలో మారుమూల పల్లెకు కూడా నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకొన్నది. ఒకనాడు పల్లేర్లు మొలిచిన గడ్డపై ఇప్పుడు నీళ్ల పరవళ్లు తొక్కిస్తున్నది. అడుగంటిన భూగర్భ జలాలను తట్టి లేపింది. ఎండిన నదులను నిండుకుండల్లా మార్చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంతో వాగులు, వంకలు, నదులు నిరంతర జల ప్రవాహమై కళకళలాడుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. రాష్ట్రంలోని భూములన్నీ ఆకుపచ్చని బంగారమయ్యాయి.