Crackers factory: మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లాలోని పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య 150 దాటింది. నర్మదాపురం ఏరియా ఐజీ ఇర్షాద్ వలీ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ గంటల తరబడి సాగిందని, ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ నిర్వహించాయని ఇర్షాద్ వలీ చెప్పారు. రాత్రికల్లా ఆపరేషన్ పూర్తయిందని తెలిపారు. క్షతగాత్రులు హర్దా ప్రభుత్వ ఆస్పత్రిలో, హోషంగాబాద్, భోపాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ప్రమాదం నేపథ్యంలో పటాకుల ఫ్యాక్టరీ పరిసరాల్లోని ఇండ్లను పూర్తిగా ఖాళీ చేయించామని ఇర్షాద్ వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఏరియా అంతా పోలీసుల నిఘా నీడలో ఉన్నదని చెప్పారు. కాగా, ఇవాళ ఉదయం హర్దాలోని పటాకుల ఫ్యాక్టరీలో పెద్ద పేలుడు సంభవించింది. దాంతో పటాకులకు మంటలంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది.