న్యూఢిల్లీ, మార్చి 18: దేశవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా భారీ ఖాళీలు.. పెండింగ్లో వేలాది కేసులు.. దేశంలో వినియోగదారుల వివాదాల పరిష్కార వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తున్నది. వినియోగదారుల విశ్వాసాన్ని ఈ వ్యవస్థ రోజురోజుకూ కోల్పోతున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల న్యాయస్థానాల పనితీరును 2021-25 మధ్య పరిశీలించి తొలిసారిగా విడుదల చేసిన ఒక నివేదికలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. రాష్ట్ర వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ)లలో సగానికి పైగా అధ్యక్ష, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్)వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం 2020-2024 మధ్య పెండింగ్ కేసుల సంఖ్య 87,545 నుంచి 5.15 లక్షలకు పెరిగాయి. వినియోగదారుల రక్షణ చట్టం 3-5 నెలల వ్యవధిలో వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కేసులు మూడు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇక కేరళ, జమ్ము కశ్మీర్, జార్ఖండ్లో ప్రతి మూడు కేసుల్లో రెండు కన్నా ఎక్కువ (70-80 శాతం) మూడేండ్ల కన్నా ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్నాయి.