న్యూఢిల్లీ, జనవరి 29: భారతీయులకు గత ఏడాది రికార్డుస్థాయిలో 14 లక్షల వీసాలను జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ సోమవారం వెల్లడించింది. విజిటర్ వీసా అపాయింట్మెంట్ కోసం వేచిచూసే సమయాన్ని 75 శాతానికి తగ్గించగలిగామని తెలిపింది. వరుసగా మూడో ఏడాది ప్రపంచంలోనే అత్యధికంగా 1,40,000కిపైగా స్టూడెంట్ వీసాలను భారతీయ విద్యార్థులకు జారీచేసినట్టు పేర్కొన్నది.
‘స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్లో ప్రపంచంలోనే టాప్-4 ప్రదేశాలుగా ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాలు నిలిచాయి. 2022తో పోలిస్తే 2023లో వీసా దరఖాస్తుల సంఖ్య 60 శాతం పెరిగింది. విజిటర్ వీసా అపాయింట్మెంట్ టైమ్ 1000 రోజుల నుంచి 250 రోజులకు తగ్గింది’ అని యూఎస్ ఎంబసీ పేర్కొన్నది. వీసా దరఖాస్తుల సంఖ్య అనూహ్యంగా పెరగటంతో, డిమాండ్ను అందుకునేలా ముంబయి కాన్సులేట్లో తాత్కాలిక, శాశ్వత సిబ్బందిని పెంచామని వెల్లడించింది.