కోల్కతా, సెప్టెంబర్ 9: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. దుర్గాపూజ సందర్భంగా తయారు చేయించిన టీషర్టులపై అమిత్ షా వ్యంగ్య చిత్రాన్ని ముద్రించింది. దానికింద ‘ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పూ’ (భారతదేశపు మహా మొద్దబ్బాయి) అని రాయించింది.
తెలుపు, నలుపు, పసుపు రంగుల్లో ఉండే ఆ టీషర్టులు బెంగాల్లో సంచలనంగా మారా యి. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని ‘పప్పు’ అని ప్రచారం చేయడం బీజేపీ పనిగా పెట్టుకున్నది. ఇప్పుడు అదే పేరును టీఎంసీ అమిత్షాకు తగిలించింది. ‘వెక్కిరింత అనేది ప్రజలతో సం భాషించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మా జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అమిత్షాపై పప్పు ముద్రవేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడది టీషర్టుల మీదకు వచ్చింది’ అని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రయన్ మీడియాకు చెప్పారు.
2024లో బీజేపీని ఆటాడిస్తాం
విపక్షాలు కలిసి బీజేపీని దీటుగా ఎదుర్కొంటాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ‘2024లో బీజేపీని ఆటాడిస్తాం’ అని పేర్కొన్నారు. తృణమూల్ పార్టీ సభలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ చేతులు కలుపుతాయని అన్నారు. ‘మేమంతా ఒకవైపు, బీజేపీ మరొకవైపు ఉంటాయి’ అని చెప్పారు. ‘తమకు 300 సీట్లు ఉన్నాయని బీజేపీ వాళ్లు ఎప్పుడూ చెబుతుంటారు. రాజీవ్గాంధీకి కూడా 400 సీట్లు ఉండేవి. కానీ ఆ తర్వాతి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈ విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలి’ అని మమత పేర్కొన్నారు.