న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇదే చివరిదిగా భావిస్తున్న ఈ క్యాబినెట్ సమావేశంలో ‘వికసిత్ భారత్ – 2047’పై మేధోమథనంతో పాటు మూడోసారి అధికారంలోకి వచ్చాక రానున్న ఐదేండ్లు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
ముఖ్యంగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటి 100 రోజుల పాటు తీసుకోవాల్సిన సత్వర చర్యలపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం. రానున్న ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగగా, మంత్రులు ప్రజల్లోకి వెళ్లి వివిధ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించాలని ప్రధాని మోదీ కోరినట్టు సమాచారం. కాగా, 2047 నాటికి దేశం సాధించాల్సిన లక్ష్యాలు, ఆర్థిక వృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సులభతర వాణిజ్యం, జీవనం, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ‘వికసిత్ భారత్’ పేరుతో రోడ్మ్యాప్ తయారుచేసినట్టు అధికార వర్గాలు తెలియజేశాయి.