న్యూఢిల్లీ, జూన్ 15: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఉద్యమశీలత ఒక వ్యాపారంగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రభుత్వ ఉద్యోగికి అడ్డుపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఆర్టీఐ కార్యకర్తతోపాటు మరో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త రాకేశ్ కుమార్ బెహల్కు బెయిల్ నిరాకరించిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించే అధికారం మీకు ఎక్కడిదని వారిని ప్రశ్నించింది. ఆర్టీఐ ఉద్యమశీలత ఒక కొత్త వ్యాపారంగా మారుతున్నది.
కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రహదారి నిర్మాణ బాధ్యతను అదే చూసుకుంటుంది. మీకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. మిమ్మల్ని మీరు ఆర్టీఐ కార్యకర్త అని పిలుచుకుంటున్నారు. ఇది ఎల్లో జర్నలిజం లాంటిదే. మీ పిటిషన్ కొట్టివేస్తున్నాము అని జస్టిస్ మెహతా పేర్కొన్నారు. జస్టిస్ మెహతా అభిప్రాయాలతో జస్టిస్ బిష్ణోయ్ ఏకీభవిస్తూ ఈ రోడ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి మీరెవరు? మీరేమైనా అత్యున్నత అధికార సంస్థనా లేక ఇంకేమైననా? అని అన్నారు.
తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బెహల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లోని అవినీతిని బయటపెట్టినందుకే తమను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా బటాలాలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులకు బెహల్, మరో నిందితుడైన రాజీవ్ కుమార్ ఆటంకం కలిగించారు. అంతేగాక పనుల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఫిర్యాదుదారుని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.