న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: విచారణ కొనసాగుతున్న కేసులపై ‘మీడియా ట్రయల్స్’ తగదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మీడియా సంస్థలు పక్షపాతంగా రిపోర్టింగ్ చేయడం వల్ల.. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, నేరానికి పాల్పడినట్టు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది. బాధితులు లేదా ఫిర్యాదుదారుల గోప్యతను మీడియా ట్రయల్స్ ఉల్లంఘిస్తున్నాయని, ఇదే సమయంలో నిందితుల హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు కేసుల వివరాలను మీడియాకు వెల్లడించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, దర్యాప్తు ఏ దశలో కేసు వివరాలను బయటకు చెప్పాలో గైడ్లైన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పింది.
క్రిమినల్ కేసుల వివరాలను మీడియాకు వెల్లడించే విషయంలో పోలీసులు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శకాల రూపకల్పనలో రాష్ర్టాల డీజీపీలు, జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సహకరించాలని, ఈ మేరకు తమ సూచనలను హోంశాఖకు మూడు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.
దర్యాప్తుపై ప్రభావం చూపే చాన్స్..
‘మీడియా ట్రయల్స్’ వల్ల న్యాయ పరిపాలన ప్రభావితం అవుతుందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. బాధితులు, నిందితుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పోలీసులు దర్యాప్తు ఏ దశలో వివరాలను మీడియాకు చెప్పాలో నిర్ణయించుకోవడం ముఖ్యమని పేర్కొన్నది. ఇందులో ప్రజా ప్రయోజనాలను కూడా దాగి ఉంటాయని, నేర సంబంధిత విషయాలపై మీడియా రిపోర్టింగ్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అనేక విషయాలను కలిగి ఉంటుందని తెలిపింది. దర్యాప్తు సమయంలో కీలక ఆధారాలను వెల్లడిస్తే అది దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. రిపోర్టింగ్ సమయంలో పారదర్శకత, నిష్పక్షపాతం పాటించాలని, బాధ్యతాయుతంగా ఉండాలని చీఫ్ జస్టిస్ ఈ ఏడాది మార్చిలో సూచించారు. ప్రసంగాలు లేదా తీర్పుల్లో కొంత భాగాన్ని మాత్రమే చెప్పడం ఆందోళనకరమని, ఇది చట్టపరమైన అంశాలపై ప్రజల అభిప్రాయంపై ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు.