న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: స్టాక్ మార్కెట్లో భారత మదుపరుల ప్రయోజనాలకు ప్రస్తుతం సరైన రక్షణ లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మార్కెట్ నియంత్రణకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మదుపరుల ప్రయోజనాలకు పటిష్ఠ రక్షణ కల్పించాల్సిన అవసరమున్నదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన హిండెన్బర్గ్ నివేదికపై అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)ని ఆదేశించింది. అదానీ గ్రూపు షేర్ల విలువను కృత్రిమంగా దిగజార్చి (ఆర్టిఫిషియల్ క్రాష్) అమాయక మదుపరులను నిలువు దోపిడీ చేశారని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
అదానీ గ్రూపు షేర్ల ఆర్టిఫిషియల్ క్రాషింగ్ వల్ల మదుపరులకు రూ.10 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు పిటిషనర్లు పేర్కొనడంతో.. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల నియంత్రణకు అవలంబిస్తున్న పద్ధతులతోపాటు భవిష్యత్తులో మదుపరులకు ఎలాంటి రక్షణ ఉంటుందో తెలియజేయాలని ధర్మాసనం సెబీని ఆదేశించింది. మదుపరుల రక్షణ కోసం పటిష్ఠమైన పద్ధతులను ప్రవేశపెట్టేందుకు డొమైన్ నిపుణులు, ఇతరులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. అదానీ గ్రూపు షేర్ల విలువను కృత్రిమంగా తగ్గించారంటూ హిండెన్బర్గ్ రూపొందించిన నివేదికపై ప్రస్తుతం సర్వత్రా విస్తృత చర్చ జరుగుతున్నదని, దీంతో దేశీయ మదుపరులకు ఎలా రక్షణ కల్పించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నదని పేర్కొన్నది.
అదానీ గ్రూపు షేర్లలో షార్ట్ సెల్లింగ్ జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై సెబీ కూడా విచారణ జరుపుతుండవచ్చని, కానీ మదుపరుల పెట్టుబడులకు నష్టం వాటిల్లకుండా భవిష్యత్తులో ఎలాంటి రక్షణ కల్పిస్తారన్న దానిపై కేంద్రం, సెబీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరమున్నదని తెలిపింది. ఇదేమీ బెదిరింపు కాదని, సూచన మాత్రమేనని పేర్కొన్నది. దీనిపై సెబీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. హిండెన్బర్గ్ నివేదిక వల్ల ఉత్పన్నపైన పరిస్థితిని సెబీ నిశితంగా పరిశీలిస్తున్నదని, స్టాక్ మార్కెట్లో అవకతవకలను నిరోధించేందుకు సెబీతోపాటు ఇతర చట్టబద్ధ సంస్థలు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నాయని చెప్పారు. దీంతో ఈ రెండు పిల్స్పై తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్పై హిండెన్బర్గ్ సంస్థ వెలువరించిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై పార్లమెంట్లో చర్చ జరుపాలని బీఆర్ఎస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.