Supreme Court | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ‘హిందూ మతం అనేది ఒక మతం కాదు ఒక జీవన విధానం. ఇందులో ఎలాంటి మత దురభిమానానికి తావు లేదు. గతానికి సంబంధించిన కొన్ని విషయాలను తవ్వుకోవడం వల్ల అది దేశంలోకి అసమ్మతిని తెస్తుంది. అలాంటి చర్యలతో దేశాన్ని నిత్యం రగిలేలా చేయొద్దు’ అని సుప్రీం కోర్టు హెచ్చరించింది. మనదేశాన్ని గతంలో ఆక్రమించిన రాజులు, పాలకులు పెట్టిన పలు ప్రదేశాల చారిత్రక పేర్ల మార్చాలన్న పిటిషన్పై స్పందిస్తూ.. గతం అనేది ప్రస్తుత, భవిష్యత్తు తరాలను వెంటాడేలా ఉండకూడదని స్పష్టం చేసింది. నగరాలు, పట్టణాల చారిత్రక పేర్లను పునరుద్ధరించేలా ‘పేర్ల మార్పు కమిషన్’ను ఏర్పాటు చేయాలని బీజేపీ నేత అశ్వినికుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. దుర్మార్గులైన కొందరు విదేశీ ఆక్రమణదారులు మన దేశంలోని పలు పురాతన చారిత్రక, సాంస్కృతిక, మతసంబంధ ప్రదేశాల పేర్లను ఇష్టం వచ్చినట్టు మార్చివేశారని అశ్వినికుమార్ తన పిటిషన్లో ఆరోపించారు. దీనిపై జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్న ధర్మాసనం అసలు ఈ పిటిషన్ వెనుక ఉద్దేశమేమిటని నిలదీస్తూ.. దేశం నిత్యం అట్టుడికిపోవాలని కోరుకొంటున్నారా? అని ప్రశ్నించింది.
‘మనది లౌకిక దేశం.. రాజ్యాంగ రక్షణకు కట్టుబడి ఉన్నాం.. మీరేమో గతాన్ని తవ్వుతున్నారు. ముఖ్యంగా ఒక మతాన్ని వేలెత్తి చూపుతున్నారు. అలాంటి అంశాలను తిరిగి తెరమీదకు తేవడమంటే దేశాన్ని అసమ్మతితో ఉడికేలా చేయడమే. దేశ చరిత్ర అంటే ప్రస్తుత, భవిష్యత్తు తరాలను వెంటాడే విధంగా ఉండరాదు’ అని వ్యాఖ్యానించింది. ‘హిందూమతం చాలా గొప్ప మతం. దానిని మీరు అవమానపర్చవద్దు. ఈ రోజుకు కూడా ప్రపంచమంతా నిత్యం మనవైపే దృష్టిసారిస్తున్నదని నేను చెప్పగలను. నేను స్వతహాగా క్రైస్తవుడిని అయినప్పటికీ సమానంగా హిందూమతాన్ని కూడా ఇష్టపడతాను, దానిని అధ్యయనం చేస్తా. దాని గొప్పదనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. అలాంటి గొప్ప హిందూమతాన్ని ఇలాంటి ఉద్దేశానికి వాడొద్దు. నా స్వస్థలమైన కేరళలో ఎంతోమంది హిందువులు చర్చిలకు తమ భూములు విరాళంగా ఇవ్వడం నాకు తెలుసు’ అంటూ జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు.
‘దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలెన్నో ఉన్నాయి. హిందూమతం మన జీవన విధానం. అది అందరినీ కలుపుకొని పోతుంది. దాని కారణంగానే మనం అందరూ కలిసి ఉండగలుగుతున్నాం. మనలో అంతఃకలహాలు సృష్టించడానికి గతంలో బ్రిటిష్ వారు విభజించు పాలించు సిద్ధాంతాన్ని తీసుకువచ్చారు. దాన్ని మళ్లీ వెనక్కి తేవొద్దు. మతాన్ని ఇందులోకి ఈడ్చొద్దు. పలుసార్లు దేశం ఆక్రమణకు గురైంది. అనేకమంది విదేశీ ఆక్రమణదారులు పాలించారు. అదంతా చారిత్రక వాస్తవం. దాన్ని తొలగించడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? దేశంలో ఇది తప్ప మరో సమస్య లేదా?’ అని జస్టిస్ బీవీ నాగరత్న ప్రశ్నించారు. అంతకుముందు ఉపాధ్యాయ తన వాదన వినిపిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ను అమృత్ ఉద్యాన్గా పేరు మార్చిందని, అయితే గతంలో కొందరు మన దేశాన్ని ఆక్రమించి పెట్టిన రోడ్లు, ఇతర కట్టడాల పేర్ల పునరుద్ధరణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులు, అధికారాన్ని ధిక్కరించడమే అవుతుందని తెలిపారు. అయితే, ఈ వాదనతో ఏకీభవించని ధర్మాసనం.. పిటిషన్ను కొట్టివేసింది.