Startup India | హైదరాబాద్, జనవరి 10 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన ‘స్టార్టప్ ఇండియా’ నిర్వీర్యమవుతున్నది. దేశీయ అంకుర సంస్థలకు వస్తున్న పెట్టుబడులు తగ్గుముఖం పడుతుండటమే దీనికి రుజువు. 2022లో దేశంలోని స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ ద్వారా 25 బిలియన్ డాలర్ల (రూ. 2.07 లక్షల కోట్లు) నిధులు సమకూరగా, 2023లో ఇది 7 బిలియన్ డాలర్లకు (రూ. 58 వేల కోట్లు) (73 శాతం తగ్గుదల) పడిపోయింది.
స్టార్టప్లకు నిధుల కొరత ఈ స్థాయిలో ఏర్పడటం గడిచిన ఏడేండ్లలో ఇదే తొలిసారి. ఈ మేరకు ఫైనాన్షియల్ రిసెర్చ్ వేదిక ‘ట్రాక్సన్’ ఓ నివేదికలో వెల్లడించింది. స్టార్టప్ ఫండింగ్ ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలోనూ భారత్ స్థానం పడిపోయింది. 2021, 2022లో ఈ విషయంలో నాలుగో ర్యాంకులో ఉన్న భారత్.. 2023 నాటికి ఐదో స్థానానికి పరిమితమైంది.