న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నీట్-యూజీ ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభించేందుకు జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ)కు అడ్డు తొలిగింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలను ప్రకటించవద్దని, ప్రశ్నపత్రాలు, మహారాష్ట్రలో ఓఎంఆర్ షీట్లు మారిపోయిన ఇద్దరు అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ఇటీవల బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ స్టే విధించింది. ఫలితాలను ప్రకటించవచ్చని ఎన్టీఏకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 16 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను ఆపలేమని, ఆ ఇద్దరు విద్యార్థుల విషయంలో దీపావళి సెలవుల తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఎన్టీఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న ‘నీట్’ నిర్వహించారు.