న్యూఢిల్లీ, జూలై 12: బీజేపీ పాలనలో దేశంలోని మైనారిటీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. క్రైస్తవులకు భద్రత కరవైంది. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి దాడుల ఘటనలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నాటికి అంటే ఆరు నెలల కాలంలో క్రైస్తవులపై 400 దాడులు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో 274 ఘటనలే నమోదవగా ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన దాడుల సంఖ్య దేశంలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ ఏడాది జూన్లో సగటున రోజుకు 3 చొప్పున అత్యధికంగా 88 ఘటనలు జరిగాయి. ఈ మేరకు యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్ (యూసీఎఫ్) ఓ నివేదికను వెల్లడించింది. దేశంలోని 23 రాష్ర్టాల డాటాను విశ్లేషించి నివేదిక విడుదల చేసింది.
యూపీలో అత్యధికంగా 155 ఘటనలు…
బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే క్రైస్తవులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం 155 ఘటనలతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. బీజేపీ పాలిత రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అస్సాం, గోవా, చండీగఢ్, జమ్ముకశ్మీర్ ఈ జాబితాలో ఉన్నాయి. యూపీ తర్వాత వరుసగా ఛత్తీస్గఢ్ (84), ఝార్ఖండ్ (35), హర్యానా (32), మధ్యప్రదేశ్ (21), పంజాబ్ (12), కర్ణాటక (10), బీహార్ (9), జమ్ముకశ్మీర్ (8), గుజరాత్ (7)లో ఎక్కువ దాడులు జరిగాయి. యూపీలోని జాన్పూర్ (13), రాయ్బరేలి, సీతాపూర్ (11), కాన్పూర్ (10), ఆజంగఢ్, ఖుషినగర్ జిల్లాల్లో 9 దాడుల చొప్పున రాష్ర్టాలతో పోటీపడ్డాయి. ఉత్తరాఖండ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, హిమాచల్ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, చండీగఢ్, గోవా తదితర రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు తెలిపింది. బీజేపీ గద్దెనెక్కిన 2014 నుంచి దాడులు ఎక్కువైనట్టు వెల్లడించింది. 2014లో 147 ఘటనలే జరగగా 2022 నాటికి ఆ సంఖ్య 599కి చేరుకున్నట్టు పేర్కొంది. 2015లో 177, 2016లో 208, 2017లో 240, 2018లో 292, 2019లో 328, 2021లో 505 దాడులు జరిగినట్టు తెలిపింది.
బెయిల్ నిరాకరణ…
మణిపూర్లో అల్లర్ల వల్ల చాలా చర్చిలు నేలమట్టం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులను విడిచిపెట్టి బాధితులైన క్రిస్టియన్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపింది. మత మార్పిడులకు పాల్పడుతున్నారనే తప్పుడు ఆరోపణలపై 63 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, బెయిల్ రాకపోవడంతో 35 మంది పాస్టర్లు జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.